ఇటీవల హీరో విశాల్ గురించి ఓ వార్త హల్ చల్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. సోషల్ మీడియాలోనూ ఇది ట్రెండింగ్ గా మారింది. తాజా ఈ రూమర్స్పై విశాల్ స్పందించారు. చంద్రబాబుపై పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే ప్రచారం జరుగుతోందని.. వాటన్నింటినీ ఖండిస్తున్నానని విశాల్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి తాను ఇప్పటివరకూ ఎవరిని కలవలేదన్నారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియటం లేదన్నారు. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.