ఆడపిల్ల పుట్టిందని..భార్యను రెండేళ్లుగా కాపారానికి తీసుకెళ్లలేదు..!

ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని రెండేళ్లుగా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల మేరకు నాదేండ్ల మండలం బుక్కాపురానికి చెందిన నాగాంజలికి, పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన వెంకటేశ్వరరావుకు మూడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో 1.5 ఎకరాల పొలం, రూ.6 లక్షలు విలువ చేసే కాట్నకానుకలు ఇచ్చుకున్నారు..

సంవత్సరం తర్వాత నాగాంజలి గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడంతో వెంకటేశ్వరరావు భార్యను కాపురానికి తీసుకెళ్లడం లేదు. నాగాంజలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అలా రెండేళ్ల పాటు తన భర్త కాపురానికి తీసుకెళ్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసింది. 

కానీ అత్తింటి వారి నుంచి ఎలాంటి పిలుపురాలేదు. దీంతో నాగాంజలి తన బిడ్డతో కాశిపాడులోని అత్తారింటికి వచ్చింది. ఆమె రాకను తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. చేసేదేమీ లేక నాగాంజలి తన బిడ్డతో అత్తింటి ముందు బైఠాయించింది. రాత్రంతా ఇంటి ముందే కూర్చుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆందోళన విరమించాలని పెద్దలు కోరినా ఆమె ససేమిరా అంటుంది.  

Leave a Comment