ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ శాఖలో త్వరలో 3,795 వీఆర్వోల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో వీఆర్వో(గ్రేడ్-2) పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) గా పనిచేస్తున్న అర్హులకు వీఆర్వోలుగా ఎంపిక చేయాలని పలు అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 3,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతిచ్చింది.
పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు ఇవే..
- ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్ఏలు కచ్చితంగా ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- ఈ ఏడాది జనవరి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండాలి.
- ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించారు.
- ఇంకా వీఆర్ఏలు ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలచ్చింది.
- అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్ టైమ్ ప్రాతిపదికన అనుమతించింది.