కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ) అయిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్ఓపీ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును అక్కడే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. స్ధానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వ్యయం చేయాలన్నారు. ఈ మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) సాధించాలన్నారు. మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు.
మున్సిపాలటీల్లో శానిటేషన్ బాగుండాలని, వాటర్ అండ్ సీవరేజ్ కూడా పక్కాగా ఉండాలని సూచించారు. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలన్నారు. మున్సిపాలిటీలలో ఎంత ఆదాయం వస్తుంది.. ఎంత వ్యయం చేస్తున్నారు.. జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు.. అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు.. వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించాలని ఆదేశించారు.