ప్రభుత్వరంగ సంస్థలను నడపలేం.. స్పష్టం చేసిన ప్రధాని మోడీ..!

ప్రైవేటీకరణతోనే దేశాభివృద్ధి సాధ్యమని, వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నడిపేందుకు ఆర్థికసాయం అందించడం భారమని అన్నారు. 

నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని పేర్కొన్నారు. 

వ్యాపార రంగానికి ప్రభుత్వం తన వంతు తోడ్పాటునందిస్తుందని, ప్రభుత్వమే వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని ప్రధాని వెల్లడించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందని, ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని అన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని, 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకే అవసరమైన బాటలను బడ్జెట్ వేసిందని ప్రధాని మోడీ వివరించారు.    

 

Leave a Comment