పెళ్లి కావడం లేదన్న ఆవేదనతో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్ లామ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు 35 సంవత్సరాలు ఉంటాయి.
ఇటీవల ఆమె సెలవుల్లో ఇంటికి వెళ్లి ఆమెను ఇంటి దగ్గర ఉన్న వారు పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇప్పుడే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీసారి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. దీంతో ఆమె ఆవేదన చెందిన ఇంటి నుంచి బయలుదేరి తిరిగి విధుల్లో చేరింది.
బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగింది. తర్వాత తన స్నేహితురాలికి ఈ విషయాన్ని చెప్పింది. ఆమె హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కవితను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది.
ఎస్సై కవిత ఇంటి వద్ద నుంచి పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏం రాసిందంటే.. ‘నాకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నాను. వివాంపై ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధానం చెప్పలేక అలసిపోయాను’ అంటూ రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.