మామిడి పిందెలు తిన్నారని ఇద్దరు చిన్నారులను పశువుల పేడ తినిపించారు. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో గురువారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపాలాదారుగా ఉంటున్నారు.
తొర్రూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్ వచ్చి చిన్నారుల చేతులు కట్టేసి చితకబాదాడు. అంతేకాదు నోట్లో పశువుల పేడ కుక్కారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.