టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు నమోదు చేయండి : చంద్రబాబు

అమరావతి : టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించి, కష్టపెట్టిన వైసీపీ నేతలను, అధికారుల పేర్లను నమోదు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరినందుకు  బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేసులు పెట్టగా జైలు పాలై విడుదలైన నందిగామకు చెందిన పలువురు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముందన్నారు. ఆనాడు మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని విజయం సాధించారని గుర్తు చేశారు. 

అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా తమరు నిరసన దీక్షలో పాల్గొన్నప్పుడు నందిగామలో 20 మందిమి  నిరసనదీక్ష చేశామని టీడీనీ కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు, పోలీసు అధికారులు తమపై కక్ష గట్టారని తెలిపారు. 

ఆ నేపథ్యంలో ఎంపీ నందిగం సురేష్ రావడం, తాము రాజధానికి మద్దతు కోరడంతో అది సాకుగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. 

జైల్లో ఇబ్బంది పెట్టారు..

జైలులో తమను తల్లిదండ్రులు సైతం కలవనీయకుండా, అన్నపానీయాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. తమను అరెస్ట్ చేసిన ఎస్సైని డీఎస్పీ కౌగిలించుకుని అభినందించారన్నారు. పోలీసు స్టేషన్ వద్ద సీసీ కెమెరాలను అమర్చి తమకోసం వచ్చే వారిపై నిఘా వేశారన్నారు. పోలీసు దుస్తుల్లో ఉండి వైసీపీ కార్యకర్తలుగా  పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తమను అరెస్ట్ చేసినప్పటి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకున్నారని తెలిపారు. వైసీపీ నేతల అరాచకాలు మితిమీరాయని అయినా ధైర్యంగా ఉండండని చంద్రబాబు అనునయించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం పరితపించే ఎవరికైనా టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

 

Leave a Comment