ప్రస్తుతం రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బయటి ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డా.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బ్యాక్టీరియా, వైరస్ తో సీజనల్ వ్యాధులు ప్రబులుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలు:
- బయట తోపుడు బండ్లపై లభించే పానీపూరీలు, ఇతర ఆహార పదార్థాలు శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలి. పానీపూరీలను అస్సలు తినకపోవడమే మంచిది..
- ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి.
- ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
- జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- గర్భిణీలు వారం ముందే ఆస్పత్రుల్లో చేరి వైద్యం తీసుకోవాలి. బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచాలి.
- ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ పెట్టుకుంటే బ్యాక్టీరియా, వైరస్ కారక సీజనల్ వ్యాధులు, విష జ్వరాల బారి నుంచి తప్పించుకోవచ్చు.