ప్రస్తుతం బ్యాంకులకూ వచ్చిన ఇబ్బందేమీ లేదని, అన్ని బ్యాంకులూ పటిష్టంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళనపడొద్దని, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. శుక్రవారం ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
‘‘ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఖరీఫ్లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోగం బాగా తగ్గింది. భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనావేసింది. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి. జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం. లాక్డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంది. లాక్డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం’’ అని శక్తికాంత దాస్ వివరించారు.
ఆర్బీఐ కీలక నిర్ణయాలు..
- రెపో రేటు యథాతథం.
- రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు.
- రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు.
- జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు.
- నాబార్డుకు రూ.25వేల కోట్లు.
- చిన్నతరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు..
- మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్పీఏ గడువు వర్తించదు.
- సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు.
చర్యలు
- మరింత లిక్విడిటీని మార్కెట్లోకి విడుదల చేస్తాం.
- లిక్విడిటీ నిర్వాహణలో ఆర్బీఐ సమర్థవంతంగా పనిచేస్తుంది.
- లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం.
- క్రెడిట్ ఫ్లో బ్యాంకులకు కొనసాగిస్తూనే వాళ్లను ప్రోత్సహించాలని అనుకుంటున్నాం.
- టిఎల్టిఆర్ఓ ద్వారా రూ.50 వేల కోట్లు విడుదల. ఇది మొదటి దఫా మాత్రమే. అవసరాన్ని బట్టి పెంచుతాం కూడా.
- మైక్రోఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఇది మేలు చేస్తుంది.