కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు – సీఎం జగన్

కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్-19 పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. 

పిహెచ్‌సిలు, యుహెచ్‌పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జిజిహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదన్నారు. కోవిడ్‌ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఈనంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కాల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు.జిల్లా కలెక్టర్లు, జెసిలు ప్రతిరోజూ 104 కాల్‌ సెంటర్లకు, జిల్లా కోవిడ్‌ సెంటర్‌లకు మాక్‌ కాల్స్‌ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనే దానిని పరీక్షించాలని సీఎం జగన్ తెలిపారు. 

ఆర్‌టిపిసిఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్‌ లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని చెప్పారు. పాజిటీవ్‌ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వున్న వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్‌లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

కోవిడ్‌ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్‌ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చామన్నారు.  మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మరో వారం రోజుల్లో రెగ్యులర్‌ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 

Leave a Comment