వ్యవస్థలో మార్పు రావాలి

నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి

సీఎం జగన్ మోహన్ రెడ్డి

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం, దిశ యాప్ లాంచ్

రాజమండ్రి : నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే అకృత్యాలు తగ్గుతాయని, నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ యూనివర్సిటీ ఆడిటోరియంలో దిశ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే దిశ చట్టం లక్ష్యమన్నారు. నేరం చేసిన వారు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మద్యం సేవించి రాక్షసులుగా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. అయితే సినిమాల్లో చూపించినట్లుగా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు :

‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 7 రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు. ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా దిశ చట్టం తీసుకవచ్చామన్నారు. వ్యవస్థలో మార్పులు రావాలన్నారు.  మహిళల కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లు, డీఎస్పీ స్థాయి నేతృత్వంలో 47 మంది సిబ్బంది పనిచేస్తారన్నారు. 13 జిల్లాల్లో ‍ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 26 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. హైకోర్టు అనుమతితో త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు విడుదల చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని సహా డీజీపీ గౌతం సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. 

సున్నా వడ్డీకే రుణాలిస్తాం..

పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అనంతరం జరిగిన మహిళా సదస్సులో జగన్ మాట్లాడుతూ..మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని, త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతామని సీఎం తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకం ఉండేదని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిని నిలిపి వేసిందని అన్నారు.మహిళలకు 50శాతం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని తీసుకొచ్చామన్నారు..

 

Leave a Comment