మీరు ఇంట్లోనే.. మీ కోసం మేం బయట

 విజయవాడ: ‘‘ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపునకు స్పందిద్దాం.. కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను జయిద్దాం’’ అని డీజీపీ గౌతం సవాంగ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ప్యూ పాటించాలన్నారు. ‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసులు అప్రమత్తతో ఉంటారని… కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. 

ఇక ఇది ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనని.. డయల్‌ 100 ద్వారా విస్త్రృతంగా.. నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. కాగా కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ప్రకారం ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’కు సంఘీభావం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఎందుకీ జనతా కర్ఫ్యూ?

కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు. తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం.  కావున జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదాం.

 

Leave a Comment