ఏపీలో కరోనా తొలి పాజిటివ్ కేసు..

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులోని ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో తేలడంతో అతని శాంపిల్స్ ని తిరుపతి వైరాలజీ కేంద్రానికి పంపారు. ఆ యువకుడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని తెలిసింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు సమాచారం. అయితే అతనికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చే సమయానికి అతనికి ఈ లక్షణాలు తగ్గడం గమనార్హం. ఇక ఈ కేసుతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. మహారాష్ట్రలో 11 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. పూణేలో 8 మందికి, తెలంగాణాలో 3 కేసులు కాగా..ఏపీలోని నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదైంది. వైరస్ వేగంగా విస్తరిస్తోన్న కారణంగా దేశంలోనికి ప్రవేశించే వారిపై భారత్ ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాల వీసాలను రద్దు చేసింది. బ్రిటన్ మినహా అన్ని దేశాల నుంచి రాకపోకలను నిలిపివేసి స్వీయ నిర్భందాన్ని విధించుకుంది.

దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లు..

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. కరోనా వచ్చినట్లు అనుమానాలు కలిగితే.. వారిని వెంటనే పరీక్షిస్తున్నారు. ఇలా కరోనా అనుమానితులను పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా 52 కరోనా టెస్టింగ్ సెంటర్లను ప్రభుత్వం  ఏర్పాటు చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణాలో ఒకటి, ఏపీలో మూడు టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఏపీలోని కరోనా టెస్టింగ్ సెంటర్లు..

  1. శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
  2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం
  3. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతరపురం

తెలంగాణలో కరోనా సెంటర్..

  1. గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్

Leave a Comment