కరోనా ఎఫెక్ట్‌ : తాజ్‌ మూసివేత

ఆగ్రా : కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తాజ్‌ మహల్ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు 126 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా ప్రవేశానికి అనుమతించే అన్ని చారిత్రక కట్టడాలు, ప్రదర్శన శాలలు, మ్యూజియాలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్టు పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటించారు. తాజాగా భారత ప్రభుత్వం ఐరోపా సమాఖ్యలోని దేశాలతో సహా టర్కీ, బ్రిటన్‌ల నుంచి వచ్చే పర్యాటకుల ప్రవేశాన్ని కూడా బుధవారం నుంచి నిషేధించింది.

 

Leave a Comment