అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వెల్లడించింది. లండన్ నుంచి ఈ నెల 18న హైదరాబాద్ చేరుకున్న యువకుడు (22) 20న రాజమహేంద్రవరం వచ్చాడు. అతడికి నేడు కరోనా పాజిటివ్ అని తేలిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. పారిస్ నుంచి ఈ నెల 15న దిల్లీ వచ్చిన యువకుడు (24) ఈ నెల 17న విజయవాడ చేరుకున్నాడు. 20న ఆస్పత్రిలో చేరగా.. ఇవాళ కరోనా పాజిటివ్ అని తేలినట్లు వెల్లడించింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.