‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్’.. విజయవాడలో పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ విడుదలైన సంగతి తెలిసిందే.. థియేటర్లు వద్ద పవన్ అభిమానులతో సందడి నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జీవో నెంబర్ 35 ప్రకారమే సినమాను ప్రదర్శించాలని, అదనపు షోలు వేసినా.. అధిక ధరలకు టికెట్లు అమ్మినా థియేటర్లను సీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 

భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ పనితీరును పవన్ కళ్యాణ్ అభిమానులు మెచ్చుకున్నారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హ్యాట్సాఫ్ సీఎం సార్’ అంటూ కేసీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్, సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఫొటోలు ఉన్నాయి. భీమ్లానాయక్ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే..  

Leave a Comment