భారత సాయం తీసుకోని చైనా..

కోవిడ్-19ను ఎదుర్కోవడంలో భారత్ అందించే సాయాన్ని తీసుకోవడానికి చైనా ఇంకా ముందుకు రాలేదు. కరోనా  వైరస్ తో అల్లాడుతున్న వూహాన్ కి సహాయ సామగ్రిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు మిలిటరీ రవాణా విమానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది. ఆ విమానం ల్యాండ్ అవడానికి చైనా అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ సామగ్రిలో గ్లోవ్స్, సర్జికల్ మాస్క్ లు, ఫీడింగ్ పంప్స్, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే డెఫిబ్రిలేటర్స్ ఉన్నాయి. చైనా ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని భారత్ లో అత్యున్నత స్థాయి అధికారులు వెల్లడించారు. హుబాయ్ ప్రావిన్స్ లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వైరస్ ను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై దృష్టి అధికంగా కేంద్రీకరించడంతో, అనుమతినివ్వడంలో జాప్యం జరిగి ఉండవచ్చని చైనా ఎంబసీ వివరణ ఇచ్చింది. కోవిడ్ సోకుతున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఒకరు, ఇటలీలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు మరణించడం ఆందోళన పుట్టిస్తోంది. సింగపూర్, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోెవడంతో ఈ వైరస్ ను ఎలా నిరోధించాలోె అర్థం కాక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో వైపు అత్యవసరమైతే తప్ప సింగపూర్ కు ఎవరూ ప్రయాణించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 

కోవిడ్ తీవ్రతను అంచనావేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వూహాన్ కు బయల్దేరారు. ఈ వ్యాధి ఒకరికి వ్యాపిస్తే, వారి నుంచి పది మందికి వ్యాపిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. వూహాన్ పరిస్థితులను అంచనా వేసి కోవిడ్ ను ఎలా నియంత్రింవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Leave a Comment