నిజాన్ని దాచి పెళ్లి చేశారు.. ఏడాదిలోపే ఆమె జీవితం నాశనమైంది..!

వంద అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలని మన పెద్దలు చెప్పే మాట.. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అబద్దాలు చెప్పి పెళ్లి చేయడంతో జీవితాలు తలకిదులు అవుతున్నాయి. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుని అత్తారింట్లోకి అడుగుపెడుతున్న యువతుల కలలు కల్లలవుతున్నాయి. తాజాగా అలా నిజం దాచేసి యువకుడి పెళ్లి చేయడంతో పాపం ఓ యువతి జీవితం నాశనం అయింది. అనారోగ్యంతో కొడుకు చనిపోయాక కోడల్ని బయటకు గెంటేశారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు జిల్లాలోని ధనలక్ష్మీపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి తిరుపతికి చెందిన ఊహారెడ్డితో ఏడాది క్రితం వివాహం అయింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. పెళ్లి అయిన కొద్ది కాలానికే విజయేంద్రరెడ్డి అనారోగ్యంతో మంచానపడ్డాడు. అతనికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. 

అయితే కొడుక్కి కిడ్నీలు పాడైపోయిన విషయం తల్లిదండ్రులకు ముందే తెలుసు. అయినా ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. అబద్దం చెప్పి పెళ్లి చేశారన్న విషయం తెలిసినా.. ఆ బాధను దిగమింగుకొని కాపురం చేసింది ఊహ.. ఈక్రమంలో భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పడిపోయింది. ఆ బాధను భరించలేక విజయేంద్ర కొన్ని రోజులకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 భర్త చనిపోయే నాటికే ఊహ గర్భవతిగా ఉంది. భర్త తోడు కావాల్సిన సమయంలో తన సర్వస్వం కోల్పోయింది. ఆరు నెలల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టింది. కొద్ది రోజులకు పాపను తీసుకొని అత్తారింటికి వచ్చిన ఊహకు అత్తామామలు షాక్ ఇచ్చారు. ఆమెను ఇంట్లో రానీయలేదు. పైగా కర్రలు, రాళ్లతో ఆమెపై దాడి చేవారు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఊహ మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే కూర్చుంది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు పోలీసులను ఆశ్రయించింది. అక్కడ ఆమెకు నిరాశే ఎదురైంది. అబద్దం చెప్పి తన జీవితాన్ని నాశనం చేశారని, ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఊహ పోలీసులను కోరుతోంది..  

Leave a Comment