సీఎం జగన్ కి చంద్రబాబు లేఖ.. ఏం రాశారంటే..!

ఏపీలో నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో అవకతవకల విషయంలో సీఎం జగన్ కి ఆయన లేఖ రాశారు. 

లేఖలో ఏం రాశారంటే.. ‘జాబ్ క్యాలెండర్ కోసం మూడేళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంలో గత 3 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్ధుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోంది. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు డిసెంబర్‌ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారు. 

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగింది. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్ధులు భావిస్తున్నారు..

ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనంకు, రెండవ మూల్యాంకనంకు ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటి? తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెరతీశారు. మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్దులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్దులు ఫిర్యాదు చేశారు.  

ప్రభుత్వ శాఖల్లో భారీ మొత్తంలో ఖాళీలున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేస్తూ కన్నవారికి భారం కాలేక ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి తల్లితండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. అయినప్పటికీ ప్రభుత్వంలో  ఎలాంటి చలనం లేదు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇచ్చిన హామీ మేరకు 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలి’ అంటూ చంద్రబాబు లేఖలో వివరించారు. 

 

Leave a Comment