వైసీపీ లెక్కలు తేలుస్తా : చంద్రబాబు

అమరావతి : ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ లెక్కలు తేలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైసీపీకి టీడీపీని ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరే ముందు పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వడాన్ని తప్పుబట్టారు. అధికారులు తన పర్యటనకు ఆంక్షలు పెట్టడం మాని.. రోడ్లు తవ్వుతున్న వారి సంగతి చూడాలని హితవు పలికారు. రోడ్లు తవ్వినా, పొక్లెయిన్‌లు అడ్డు పెట్టినా తన పర్యటనను ఆపలేరని తేల్చి చెప్పారు. పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోందని విమర్శించారు.  

ప్రజాచైతన్య యాత్రల్లో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాలో నేడు రేపు చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఉత్తరాంధ్రలో చంద్రబాబు తొలి పర్యటన చేపట్టనుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Leave a Comment