చంద్రబాబుకు నిరసన సెగ

ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు

అచ్చెన్నాయుడు వాహనాన్ని అడ్డుకున్న స్థానికులు

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ‘గో బ్యాక్‌ చంద్రబాబు..ఉత్తరాంధ్ర ద్రోహి’ అంటూ నిరసన కారులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఉత్తరాంధ్ర పర్యటనపై ఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు పర్యటనను ప్రజాసంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వాహనాన్ని స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాబును ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్టు,ఎన్‌ఏడీ జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టులోకి పరిమిత సంఖ్యలో టీడీపీ నేతలకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మోసం చేసే పర్యటనలు..

 ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటిస్తున్నారని మంత్రి ధర్మాన  ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోపెట్టారన్నారు.

ఉత్తరాంధ్రకు ఏం చేశారని.. 

ఉత్తరాంధ్రకు ఏం చేశారని చంద్రబాబు పర్యటిస్తున్నారని వైసీపీ మహిళానేత కిల్లి కృపారాణి మండిపడ్డారు. చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్ర కాదని, పశ్చాత్తాప యాత్ర అని ఆమె దుయ్యబట్టారు.విభజన తర్వాత చంద్రబాబు తీరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ సుపరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు.

Leave a Comment