కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ ఉన్నత విద్యా సంస్థలు, పాఠశాలలను ఈనెల 21 నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రారంభానికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలను జారీ చేసింది. తరగతులు ప్రారంభమయ్యే నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
- విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలి.
- పాఠశాలల పునఃప్రారంభానికి ముందస్తు ప్రణాళిక కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు.
- కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు.
- కంటైన్మెంట్ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు.
- పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేయాలి.
- క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్ చేయాలి.
- ఉపాధ్యాయులు, సిబ్బంది 50 శాతం మంది హాజరయ్యేలా చూడాలి.
- బయో మెట్రిక్ హాజరు పద్దతి అవసరం లేదు.
- ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి.
- ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి.
- ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి.
- సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు నిషేధం.
- ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్లైన్ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి.
- తరగతి గదుల్లో ఏసీ, వెంటిలేషన్ తదితర అంశాల్లో సంబంధిత మార్గదర్శకాలు అమలు చేయాలి.
- స్విమ్మింగ్ పూల్ తప్పని సరిగా మూసివేయాలి.
పాఠశాలలు తెరిచిన తర్వాత …
- విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ ఉండాలి.
- కరోనా లక్షణాలు లేనివారిని అనుమతించాలి.
- కరోనా జాగ్రత్తలకు సంబంధించి గోడపత్రికలు డిస్ప్లే చేయాలి.
- ఏ ప్రాంతంలోనూ ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.
- సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
తరగతి గదుల్లో ఎలా ఉండాలి?
- విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి.
- తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి.
- నోట్బుక్, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి.
ప్రయోగశాలల్లో …
- ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్ సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి.
- ఉపయోగించే పరికరాలన్నిటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
- పరికరాలు ఉపయోగించే ముందు తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
గ్రంథాలయాల్లో…
- ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి
- మాస్కు తప్పనిసరిగా ధరించాలి.
- కేఫ్టేరియా, మెస్ సౌకర్యాలు మూసివేయాలి.
రవాణా, ఇతరత్రా సమయాల్లో…
- బస్సులు, ఇతరత్రా రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతోపాటు సామాజిక దూరం పాటించేలా చూడాలి.
- పాఠశాల ప్రాంగణం రోజూ శుభ్రం చేయాలి.
- కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లను శానిటైజ్ చేయాలి.
- మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి.
- విద్యార్థులతో పరిశుభ్రత పనులు చేయించరాదు.
- విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించాలి.
- పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి ప్రత్యేక గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.
ఉన్నత విద్యా సంస్థల్లో పాటించాల్సిన జాగ్రత్తలు..
- పరిశోధన, వృత్తిపరమైన కోర్సులు నిర్వహించే సంస్థల్లో ప్రయోగశాలలకు అనుమతులు కరోనా ప్రామాణిక నిర్వహణ నిబంధనలకు లోబడి ఉండాలి.
- నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఉపయోగించే పరికరాల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి. స్థలం అందుబాటులో ఉంటే ఆయా పరికరాలను ఆరుబయట లేదా వరండాలలో అమర్చి భౌతిక దూరం పాటించేలా చూడాలి.
- ఆన్లైన్ తరగతులు, రెగ్యులర్ తరగతులు సమ్మిళితంగా కొనసాగాలి.
- రెగ్యులర్ తరగతి గదుల్లో విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వేర్వేరు టైమ్ స్లాట్ను అమలు చేయాలి.
- ఆరు అడుగుల దూరం పాటిస్తూ సిటింగ్ ఏర్పాట్లుండాలి.
- వసతి గృహాల్లోనూ పడకల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.
- వైరస్ సోకిన విద్యార్థులకు వెంటనే ప్రత్యేక గదులు కేటాయించాలి. వైద్య సదుపాయం కల్పించాలి.
- ఆహారశాలల్లో రద్దీ నివారణకు భోజన సమయాలను వేర్వేరుగా కేటాయించాలి.
- చేతులు శానిటైజ్ చేసుకొనే వసతులు అందుబాటులో ఉండాలి.
Health Ministry issues SOP for partial reopening of Schools for students of 9th-12th classes on a voluntary basis, for taking
guidance from their teachers in the context of #COVID19.https://t.co/i1I8pPwXyT pic.twitter.com/6c9datyVOC— Ministry of Health (@MoHFW_INDIA) September 8, 2020