కరోనా వైరస్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది ఇంట్లోనే నాటు వైద్యం చేసుకుంటున్నారు. మరి కొంత మంది విటమిన్లు ఎక్కువగా తీసుకుంటే కరోనా రాదని విపరీతంగా వాటిని తీసుకున్నారు. అల్లం, వెల్లుల్లి, మిరియాలు తీసుకుంటే కరోనా రాదనే భావనలో ఉన్నారు. అయితే ఏది నిజం? కషాయాలు తీసుకుంటే కరోనా నిజంగానే రాదా?
అలా అయితే తమిళనాడులో మిరియాలను ప్రతి రోజు ఏదో ఒక వంటకంలో ఉపయోగిస్తారు. పొంగల్, సాంబర్ లలో వేసుకొని తింటారు. కానీ అక్కడ కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఇక మరాఠీలు అల్లం లేకుండా టీ తాగరు..మరీ అక్కడ కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇక గుజరాతీలకు పుదీనా, కొత్తమీర, చాట్ మసాల లేకుండా రోజు గడవదు. పైపెచ్చు వీరిలో వెజిటేరియన్లు ఎక్కువ. అయినా కేసులు తగ్గడం లేదు. ఇలా చాలా మంది రకరకాలు మసాలా ధినుసులను ఉపయోగిస్తారు.
ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 104 కు వస్తున్న సందేహాలను క్రోడీకరించి వాటికి సమాధానాల రూపంలో కరపత్రాలు రూపొందించింది. వాటిలో ఏమున్నాయంటే..
ప్రజల్లో ఉన్న అపోహలకు సమాధానాలు..
- మాంసాహారం తినడం ఆపేస్తే కరోనా రాదన్న అపోహా చాలా మందిలో ఉంది. మాంసాహారానికి కరోనాకు సంబంధం లేదు.
- కరోనా చికిత్సకు ఎలాంటి ఇంటి నివారణలు లేవు.
- మునుపటి వ్యాధి నిరోధక టీకాలు కరోనాను నిరోధించలేవు.
- కరోనాను అల్లం, వెల్లుల్లి నిరోధించలేవు.
- యాంటీబయోటిక్స్ వాడటంతో కరోనా తగ్గదు.
- ఆయుర్వేద, యూనానీలో కరోనాకు మందులు లేవు. అల్లోపతిలో ఐసీఎంఆర్ కొన్ని మందులు సూచించింది.
- లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తి నుంచి కూడా కరోనా సంక్రమిస్తుంది.
- చాలా మంది విటమిన్ మాత్రలు తీసుకుంటున్నారు. విటమిన్ మాత్రలకు, వైరస్ రాకకూ సంబంధం లేదు.
- కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ఒక్కటే రక్షణ..