మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో గుండెను పిండేసే ఘటన జరిగింది. ఓ పసి బాలుడిని పనిమనిషి చిత్రహింసలకు గురిచేసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తీవ్రంగా కొట్టేది.. ఆ బాలుడిలో ఆకస్మిక మార్పును గమనించిన తల్లిదండ్రులు.. వైద్యుడిని చూపించగా.. బాలుడి పేగుల్లో వాపులు వచ్చినట్లు చెప్పారు..
జబల్ పూర్ కి చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులు.. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగాలతో బిజీగా ఉండటంతో బాబును చూసుకోవడానికి ఓ రచనీ చౌదరి అనే మహిళను నియమించుకున్నారు. ఆమెకు రూ.5 వేలు చెల్లిస్తూ ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే బాలుడి ఆలనాపాలనా చూడాల్సిన ఆ మహిళ.. బాలుడిని చిత్రహింసలకు గురిచేసింది.
బాలుడిని ఇష్టారితీగా కొట్టడమే కాకుండా.. ఎక్కడికి తీసుకెళ్లాలన్నా జుట్టుపట్టి లాక్కెళ్లడం చేసింది. దీంతో బాలుడు రోజురోజుకు బలహీనంగా మారిపోయాడు. ఎప్పుడు చలాకీగా.. అల్లరి చేస్తూ ఉండే బాలుడు గత నాలుగు నెలల నుంచి సైలెంట్ గా ఉంటున్నాడు. ఆ ఆకస్మిక మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆ బాలుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
అన్ని పరీక్షలు చేసిన వైద్యుడు పేగుల్లో వాపు ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు చిత్రహింసలకు గురై ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం కొద్ది రోజులకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, రజనీనే బాలుడిని హింసించినట్లు బయటపడింది. రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.