టీడీపీ పని అయిపోయింది.. పార్టీ లేదు బొక్కా లేదు.. : అచ్చెన్నాయుడు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఆ వీడియో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత ఇక ఏమీ ఉండదని, పార్టీ పని అయిపోయిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 

ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో ఆకుల వెంకట్ అనే వ్యక్తికి 400 గజాల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ విషయంలో అచ్చెన్నాయుడు ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్ లో ఉన్నప్పుడు ఆయనతో ఆకుల వెంకట్ అనే వ్యక్తి కలిశాడు. స్థల వివాదం విషయంలో మాట సాయం చేయమంటే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోవడం లేదని, తాను పార్టీనే నమ్ముకుంటే ఇలా చేస్తారా అని ఆకుల వెంకట్ ఆరోపించారు. 

లీకైన వీడియోలో అచ్చెన్నాయుడు, వెంకట సంభాషణ..

వెంకట్ – టీడీపీని నమ్ముకుని రోడ్డున పడ్డాను.. కుటుంబం మొత్తం కట్టుబట్టలతో మిగిలాను.. ఈ విషయమై నారా లోకేష్ ను కలిస్తే.. అంతకు ముందు మర్యాద అయినా ఇచ్చేవాడు. ఇప్పుడు దొంగను చూసినట్లు చేస్తున్నాడు.. నా బాధలను నారా లోకేష్ తో చెప్పుకుంటే.. కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోమని సలహా ఇచ్చాడు..లోకేష్ అసలు దారుణంగా వ్యవహరిస్తున్నారు..

అచ్చెన్నాయుడు – అందరి పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారు. లోకేష్ సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది. నేను కూడా చెబుతా.. బాధపడుతున్నాడని..

వెంకట్ – చేయరండీ వీళ్లెవరూ.. లోకేష్ ను కాదని వీళ్లేవరూ చేయరు. ఎందుకంటే బాలక్రిష్ణ ఇంటికెళ్లా.. చూసి వెళ్లిపోయాడు.. ఫోన్ చేసి మెసేజ్ లు కూడా పెట్టా.. అసలు నేను చేసిన తప్పేంటండీ?.. నాది నాకు చేయడానికి వాళ్లు అంతలా ఇబ్బంది పడుతున్నారంటే..

అచ్చెన్నాయుడు – పెద్ద గందరగోళంగా ఉంది ఇదంతా.. ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు.. పార్టీ పరిస్థితి కూడా..

వెంకట్ – ఇంకేం పార్టీ సర్? లోకేష్ ఉన్నంత వరకూ.. బాలక్రిష్ణకి డైరెక్ట్ గా చెప్పా నేను..

అచ్చెన్నాయుడు – లోకేష్ గురించి ఎందుకు అవన్ని..

వెంకట్ – అది ఎంత తప్పండి.. నన్ను సూసైడ్ చేసుకోమంటాడా? 30 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని సర్వీస్ చేసినందుకు. నా ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. రాజగోపాల్ కి చేశా.. రమేష్ కి చేశా. ఎవరూ ఎత్తడం లేదు..

అచ్చెన్నాయుడు – 17 తర్వాత ఫ్రీ అయిపోతాం. ఇక పార్టీ లేదు.. బొక్క లేదు..

వెంకట్ – అయిపోయింది సర్ పార్టీ పని అయిపోయింది.. జీరో అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి..

అచ్చెన్నాయుడు – అయిపోయింది.. జీరో అయిపోయింది. ఎప్పటి నుంచో పట్టు పట్టి ఉన్నాం కాబట్టి అలా వెళ్తున్నాం..

ప్రస్తుతం ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించారు. తన సంభాషణలను వక్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్ రెడ్డి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్ కి తోకముడిచావు.. నిన్న బుబా గారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు..’ అంటూ వ్యాఖ్యానించారు.  

 

   

Leave a Comment