లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా త్వరలో రాష్ట్రంలోని దేవాలయాలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దేవదాయ శాఖ పలు మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
లాక్డౌన్ సడలింపుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అది కూడా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే మాత్రమే ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూ..ఒక్కో గదిలో ఇద్దరికే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసి వైద్యఆరోగ్య అనుమతి కోసం దేవదాయ శాఖ పంపింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
దేవాదాయ శాఖ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు
- ఆలయాల దర్శన సమయాలను స్థానిక పరిస్థితులను బట్టి కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి.
- భక్తులు ముందుగానే బుక్ చేసుకుంటే టైమ్ స్లాట్ దర్శనం కేటాయిస్తారు.
- దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి.