ఆర్థిక నేరగాళ్ల విలువైన ఆస్తులు స్వాధీనం..!

బ్యాంకులను మోసగించి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులలో రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది.  

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీరు బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్లు మోసం చేశారు. వీటిలో రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటి వరకు రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేయగా, కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 25న మరో రూ.800 కోట్లు బదిలీ చేయాల్సి ఉంది.  

ముంబైలోని పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ బ్యాంకుల కన్సార్టియంకు ఈడీ తన వద్ద ఉన్న రూ.6,600 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. వీటిలో రూ.5,824.50 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్’ విక్రయించినట్లు ఈడీ వెల్లడించింది. 

ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని, అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించినట్లు ఈడీ పేర్కొంది. ఈ అంశాలపై మనీలాండరింగ్ చటట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. అలాగే ఈడీ సహకారంతో గతంలోనే కొన్ని షేర్లను విక్రయించి బ్యాంకులు రూ.1357 కోట్లను రాబట్టుకున్నాయి. 

Leave a Comment