పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. 

పరీక్షా కేంద్రం లో 10 – 12 మంది విద్యార్థులు మాత్రమే అనుమతి.

 రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలో కేవలం 10 నుంచి 12 మంది మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో అనుకున్న 2882 పరీక్ష కేంద్రాలకు 44 శాతం అదనంగా అంటే మొత్తం 4154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాయలంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రతి గదిలో మాస్క్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు 8 లక్షల మాస్క్ లు విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. టీచింగ్ స్టాఫ్ కు పరీక్షా కేంద్రాల్లో గ్లౌజు లు కూడా ఇస్తామన్నారు. ప్రతి కేంద్రంలో ఒక ధర్మల్ స్కానర్ ఉండే విధంగా దాదాపు 4500 స్కానర్ లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 

ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్ జోన్ లలో పరీక్షా కేంద్రాలు లేవని, ఒకవేళ ఇప్పుడున్న కేంద్రాల వద్ద కొత్తగా కరోనా కేసులు వచ్చి అవి కంటైన్మెంట్ జోన్ లోకి వెళితే వాటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండేలా అధికారులను సమాయత్తం చేశామని మంత్రి తెలిపారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఇదే తరహాలో అన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తామన్నారు. గతంలో 580 పరీక్షా కేంద్రాలు ఉంటే వాటిని కూడా 1022 కేంద్రాలకు పెంచామన్నారు. 

 

Leave a Comment