రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించింది. పండుగ ఎలా నిర్వహించుకోవాలనేది సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14న రంజాన్ పండుగ ఉంది. ఈ సందర్భంగా ఈద్గా, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక నమాజ్ ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనల్ని ఇళ్లలోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు.
మార్గదర్శకాలు..
- రంజాన్ పండుగ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు.
- ప్రార్థనల్లో మాస్క్ ధరించి.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్క్ లేకపోతే ఎవరినీ మసీదుల్లో అనుమతించకూడదు..
- ప్రార్థనలకు ముందు నిర్వహించే వుజూను ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి.
- కింద కూర్చునేందుకు వీలుగా జానీమాజ్ ఇంటి నుంచే తెచ్చుకోవాలి.
- మసీదు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.
- వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి.
- ఈద్ శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం చేయకూడదు..