కరోనాపై ఏపీలో అత్యవసర ఆదేశాలు

అమరావతి : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని సేవలు కూడా రానున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్‌పేషంట్‌ సేవలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటిలేటర్స్‌, ల్యాబ్స్‌, వైద్యులు, నాన్‌ మెడికల్‌ సిబ్బంది సేవలు ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యు నిపుణుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. అవసరమైన చోట తక్షణం సేవలు వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు అన్నింటిలో లోపం లేకుండా సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈరోజు రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది.

 

Leave a Comment