అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ ఛైర్మన్, వీసీ శ్రీనివాసకుమార్, కన్వీనర్ డా. భానుమూర్తిలు ఈసెట్ పరీక్ష వివరాలు, తేదీని ప్రకటించారు. ఈ సారి ఈసెట్లో వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులని జేఎన్టీయూఏ వీసీ శ్రీనివాస కుమార్ తెలిపారు. ఏపీ ఈసెట్ 2020-21 ద్వారా 14 కోర్సుల్లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి దరఖాస్తుల ఆన్లైన్ స్వీకరణ మొదలవుతుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 కేంద్రాల్లో ఈసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పరీక్ష కన్వీనర్ డా.భానుమూర్తి వివరించారు. గత ఆరేళ్ల నుంచి అనంతపురం జేఎన్టీయూ విజయవంతంగా ఈసెట్ పరీక్షను నిర్వహిస్తోందన్నారు.