అమిత్ షా రాజీనామా చేయాలి : సోనియా

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ భేటిలో ఢిల్లీ పరిస్థితిపై సమీక్షించిన అనంతరం బుధవారం కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఘర్షణలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ అల్లర్లను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలను మోహరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయని ధ్వజమెత్తారు. 

రంగంలో పారా మిలటరీ బలగాలు…

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసలో గత మూడు రోజులుగా 20 మందికి పైగా చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన పారా మిలటరీ బలగాలు పలు చోట్ల కవాతు నిర్వహించాయి. డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భద్రతా వ్యవహారాలను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పడు పర్యవేక్షస్తోంది. ఇప్పటి వరకు ఉన్న భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 35 కంపెనీల పారామిలటరీ బలగాలు భద్రతను చూస్తుండగా..దీన్ని 45 వరకు పెంచాలని నిర్ణయించారు. 800 మంది ప్రత్యేక కమాండోలను మోహరించనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు పెర్కొన్నాయి. 

నిందితులను కఠినంగా శిక్షించండి – విజయన్

ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఈ ఘటనలకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించడంలో కేంద్రం వెనకడుగు వేయోద్దని కోరారు. హింసను నియంత్రింకచేందుకు అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని కోరారు. 

విచారణ జరపాలి – మాయవతి

ఢిల్లీలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై బీఎస్పీ అధినేత్రి మాయవతి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటలను ఖండించిన ఆమె దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ అల్లర్లకు పాల్పడినవారిని, వీటి పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Leave a Comment