రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సెలబ్రెటీలు వీరే..!

మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా, అవతలి వ్యక్తి అతి వేగం, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం కావచ్చు. ఒక్కోసారి మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలా రోజూ ఎందరో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటారు. ఈ రోడ్డు ప్రమాదాలు సామాన్యులతో పాటు ప్రముఖుల కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపుతున్నాయి. ఇక స్పోర్ట్స్ బైకులు, ఇంపోర్టెడ్ బైక్ లు, ఖరీదైన కార్లలో దూసుకుపోతూ సెలబ్రెటీల పిల్లలు దర్మరణం చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

2018లో సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరులో ఓ వివాహానికి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.  2014లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కూడా నల్గొండ జిల్లాలో కారు అదుపుతప్పడంతో ఆయన చనిపోయారు. 2009లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నల్గొండ జిల్లాలోనే ప్రమాదాని గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. 

మరో సినీ నటుడు, రాజకీయ నాయకుడు బాబా మోహన్ కుమారుడు పవన్ కుమార్ హైదరాబాద్ లో తన స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకట సాయి ప్రసాద్ కూడా స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కూడా అక్కడికక్కడే మరణించారు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కూడా బైక్ ప్రమాదంలో చనిపోయాడు. 

2017లో మాజీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ, అతడి స్నేహితుడు రవిచంద్ర రోడ్డు ప్రమాదాంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొనండంతో ఈ ప్రమాదం జరిగింది. 2011లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కూడా కారు ప్రమాదంలో చనిపోయారు. ఇలా కారు, బైక్ ప్రమాదాల్లో పలువురు సినీ రాజకీయ నాయకుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.  

Leave a Comment