కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్రం ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. మార్చి 31 వరకు ఉన్న పలు గడువులను జూన్ 30కి పొడగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించారు. ఆధార్, పాన్ అనుసంధానాన్ని కూడా జూన్ 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి వెల్లడించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వివాద్ సే విశ్వాస్ తక్ స్కీం ఎంపిక చేసుకునేందుకు కూడా గడువు పెంచారు. మార్చి 31 తర్వాత వివాద్ సే విశ్వాస్ తక్ ఎంపిక చేసుకుంటే 10 శాతం అదనంగా ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని కూడా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అయితే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ఏటీఎం విత్డ్రాలపై కేంద్రం తీపి కబురు
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటించాలని ఆదేశించిన కేంద్రం క్యాష్ విత్డ్రాలపై ఆంక్షలను సడలించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయంతో లాక్డౌన్ను పాటించే ప్రజలకు కొంత ఊరటనిచ్చినట్టయింది. ఈ సడలింపుతో కనీస నగదు నిల్వను కూడా దైనందిన ఖర్చులకు వినియోగించుకునే అవకాశం ప్రజలకు లభించింది. హమ్మయ్య .. ఇన్నాళ్లూ మినిమమ్ బాలన్స్ లేదనే సాకుతో మానం కొంత నగదు నష్టపోయేవాళ్ళం.