కాబోయే భర్తకు ఆమె ఫొటోలు పంపిన మాజీ ప్రియుడు.. పరువు పోయిందని ప్రాణం తీసుకున్న యువతి..

ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ప్రియుడి పద్ధతి నచ్చక అతని నుంచి విడిపోయింది. అయినా అతను ఆమె వదల్లేదు. వేరే అబ్బాయితో పెళ్లి కుదిరిందని తెలిసి అతనితో ఆ అమ్మాయి చనువుగా ఉన్న ఫొటోలను కాబోయే భర్తకు, వారి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. దీనిని అవమానంగా భావించిన యువతి ప్రాణం తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురం గ్రమానికి చెందిన పావని(21) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జీఎన్ఎంగా పనిచేస్తోంది. అదేగ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ, పావని కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే ప్రియుడి పద్ధతి నచ్చకపోవడంతో పావని తన ప్రియుడిని దూరం పెట్టింది.   

ఇటీవల ఆమెకు జాజిరెడ్డి గూడెం మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం అయింది. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో మాజీ ప్రియుడు వంశీ పైశాచికంగా ప్రవర్తించాడు. గతంలో తాను పావనితో దిగిన ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, అతని కుటుంబ సభ్యులకు పంపాడు. ఈ ఫొటోలను చేసి వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. 

దీంతో హైదరాబాద్ లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. కొద్ది రోజులు సూర్యాపేట చింతలచెరువులోని బంధువుల ఇంట్లో ఉండమని ఈనెల 6న ఆమెను పంపించారు. అయితే ఈనెల 9న బయటకు వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన పావని కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద పత్తి చేనులో యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పరిశీలించగా.. మృతదేహం పావనిగా గుర్తించారు. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.. మాజీ ప్రియుడి వల్ల పెళ్లి ఆగిపోవడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురై పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెళ్లి ఆగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వంశీ, అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

Leave a Comment