అమ్మకానికి గుండెతో సహా అన్ని అవయవాలు.. !

ఆ కుటుంబానికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది.. దీనికి తోడు పిల్లల అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారాయి. ఎవరి సాయం కోరినా పైసా ఇవ్వలేదు. తన పిల్లల అరోగ్యం బాగు కోసం ఎవరూ చేయని సాహసాన్ని చేసింది ఓ తల్లి.. తన గుండెతో సహా అన్ని అవయవాలను అమ్మకానికి పెట్టింది..ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. 

కొచ్చికి చెందిన మహిళ శాంతికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె గర్భంతో ఉన్నప్పుడే భర్త వదిలేశాడు.. వారి కుటుంబం కటిక దారిద్య్రాన్ని అనుభివిస్తుంది. గతేడాది ఆమె పెద్ద కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. ఇక రెండో కొడుకు పుట్టుకతోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఆమె 11 ఏళ్ల కూతురు కూడా రోడ్డు ప్రమాదంతో నరాల వ్యాధితో బాధపడుతుంది. కుటుంబ బాధ్యతను మోస్తున్న మూడో కొడుకు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. ఐదో బిడ్డ చదువుకుంటోంది. 

అద్దె ఇంట్లో ఉంటున్న తనకు అద్దె కట్టడం కూడా భారంగా మారింది. తన ముగ్గురు పిల్లల ఆరోగ్యం కోసం చాలా మందిని సాయం కోరింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఏ తల్లి చేయని సాహసానికి చేసేందుకు సిద్ధమైంది. తన గుండెతో సహా అన్ని అవయవాలు అమ్మకానికి పెట్టింది. ఒక బోర్డును ఏర్పాటు చేసి దానిపై తన బ్లడ్ గ్రూప్ తో సహా అన్ని వివరాలు రాసింది. తన అవయవాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేరళ ప్రభుత్వం స్పదించింది. ఆమెను తాత్కాలిక నివాసానికి పంపించింది. ఆమె పిల్లలకు అవసరమయ్యే చికిత్సను, మందుల బిల్లులను భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

Leave a Comment