గూగుల్ సెర్చ్ చేసి మోసపోయిన నిరుద్యోగులు.. ఉద్యోగాల పేరుతో రూ.27 లక్షలు టోకరా..!

ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కొందరు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైబర్ నేరగాళ్లకు చిక్కారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పోగొట్టుకుని మోసపోయారు. చివరికి మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రియించారు. 

వివరాల మేరకు బీటెక్ పూర్తి చేసిన కొందరు మంచి కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఉద్యోగాల కోసం గూగుల్ సెర్చ్ చేశారు. గూగుల్ సెర్చ్ చేసి ఓ నంబర్ ను సాధించారు. అతడికి ఫోన్ చేయగా.. మాదాపూర్ లో కొత్తగా ‘లిమిటెక్స్’ పేరుతో పెద్ద కంపెనీ పెట్టానని, తానే సీఈఓ అని, ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పారు. ఆసక్తి ఉంటే రెజ్యూమ్ లు పంపాలని నమ్మబలికాడు. 

ఇది నమ్మి సుమారు 35 నుంచి 40 మంది తమ రెజ్యూమ్ లు పంపి మళ్లీ అతడికి ఫోన్ చేశారు. దీంతో ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలని చెప్పాడు. ఉద్యోగం వస్తదన్న ఆశతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరు పోస్టుకు తగ్గట్టు రూ.లక్ష, రూ.3 లక్షల చొప్పున సుమారు రూ.27.30 లక్షలు ఆన్ లైన్ ద్వారా పంపారు. ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. 

దీంతో మోసపోయానని అల్వాల్ కు చెందిన బుచ్చి రాములు సోమవారం సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. తన లాగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని గూగుల్ లో సెర్చ చేయగా.. 35-40 మంది బాధితులు బుచ్చిబాబును కాంటాక్ట్ చేశారు. వీరంతా మంగళవారం నేరుగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి లాగా ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేపట్టారు. 

 

Leave a Comment