29 ఏళ్లకే గుండెపోటు.. భారత యువ క్రికెటర్ మృతి

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బరోట్(29) శుక్రవారం గుండెపోటులో మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసిఏషన్(ఎస్సీఏ) ధ్రువీకరించింది. అవికి తల్లి, భార్య ఉన్నారు. అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోనే తుదిశ్వాస విడిచాడు. సౌరాష్ట్ర క్రికెట్ లో బరోట్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. బరోట్ ఆకస్మిక మరణం పట్ల ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవషా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

అవి బరోట్ 2011లో అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2019-20 సీజన్ లో రంజీట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. తన కెరీర్ లో 38 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 38 లిస్ట్-ఎ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1547 పరుగులు, లిస్ట్ -ఎలో 1030 రన్స్, టీ20లలో 717 పరుగులు చేశాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లో 122 పరుగులు చేశాడు.  

    

Leave a Comment