బీజాపూర్ లోని తెర్రాం ప్రాంతంలో శనివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు 23 మంది జవాన్లు అమరులయ్యారు. 31 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మహిళా మావోతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు సమాచారం.. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగాయి.
ఈ ఘటనలో తొలుత ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 18 మంది జవాన్ల జాడ కానరాలేదని తొలుత పేర్కొన్న పోలీసులు.. ఆదివారం 17 మంది మృతదేహాలను గుర్తించారు. మరో జవాన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదని సమచారం.. గాయపడిన జావన్లను బీజాపూర్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మెషీన్ గన్ లతో దాడి..
జవాన్లపై దాడిలో మావోయిస్టులు లైట్ మెషీన్ గన్స్ తో పాటు అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లను కూడా వినియోగాంచారు. వీటన్నంటితో పాటు దేశీ రాకెట్ లను వినియోగించారు. దీంతో జవాన్లు అప్రమత్తమయ్యే లోపు భారీ ప్రాణనష్టం జరిగింది.
హిడ్మా పేరుతో ట్రాప్?
మావోయిస్టు అగ్రనేత హిడ్మా అడవుల్లోనే ఉన్నట్లు వదంతులు వ్యాపింపజేసిన మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హిడ్మాపై రూ.40 లక్షల రివార్డు కూడా ఉంది. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టులు సృష్టించిన ఈ ట్రాప్ లో చిక్కుకున్నాయి. బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్న చోటే మావోయిస్టులు కాచుకుకూర్చుని, వారు సమీపంలోకి రాగానే విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
ఇద్దరు తెలుగు జవాన్లు మృతి..
మావోయిస్టుల దాడిలో ఇద్దరు తెలుగు జవాన్లు అమరులయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీష్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.