ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరులపై అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. లంచాలు, అవినీతి లేకుండా పాలన సాగాలని సీఎం జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.
అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్ యాప్ రూపొందించాలని సీఎం జగన్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ‘14400 యాప్’ నూ రూపొందించారు. ఈ యాప్ ని సీఎం జగన్ త్వరలోనే ఆవిష్కరించనున్నారు.
అవినీతిపై ఫిర్యాదుల కోసం ఇప్పటికే 14400 టోల్ ఫ్రీ నంబర్ ఉంది. అయితే ఈ నంబర్ కు వచ్చు కాల్స్ పై ఏసీబీ అధికారులు స్పందించేలోపు కొందరు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా తీసుకోకుండా వారి ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు 14400 యాప్ ని రూపొందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
- 14400 యాప్ లో ‘లైవ్ రిపోర్ట్’ అని ఉంటుంది.
- అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఆ యాప్ లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఫిర్యాదు వెళ్లిపోతుంది.
- ఈ ఫీచర్ లో ఫొటో, వీడియో, ఆడియో వంటి ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉంటాయి.
- లంచం తీసుకుంటున్న ఫొటో తీసి ఈ యాప్ లో అప్ లోడ్ చేయొచ్చు. లంచం అడుతున్నప్పుడు మాటలు, లేదా వీడియో రికార్డు చేసి అప్ లోడ్ చేయొచ్చు.
- అనంతరం లాడ్జ్ కంప్లయింట్ ఆప్షన్ లో వెళ్లి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు వెళ్తుంది.